అడిలైడ్: ఆస్ట్రేలియాలో 70 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి ఆనవాళ్లు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు ఆ వ్యక్తిని పాతిపెట్టిన శవపేటిక కోసం తవ్వకాలు ప్రారంభించారు. 1948, డిసెంబర్ ఒకటో తేదీన అడిలైడ్ సమీపంలోని సోమర్టన్ బీచ్లో ఓ వ్యక్తి శవమై కనిపించారు. కానీ అతని ఆనవాళ్లు తెలియదు. అతని పేరు కానీ, అతని ఊరు కానీ తెలియదు. దీంతో ఆ వ్యక్తిని సమీప స్మశానవాటికలో ఖననం చేశారు. అయితే గుర్తు తెలియని ఆ వ్యక్తి గురించి ఆస్ట్రేలియాలో ఇన్నాళ్లుగా భిన్న కథనాలు వ్యాపించాయి. ఆ చావు ఓ మిస్ట్రీగా మిగిలిపోయింది. ఆ వ్యక్తిని పాతిపెట్టిన సమాధి వద్ద గుర్తుతెలియని వ్యక్తి అని రాసి ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అధికారులు ఆ వ్యక్తి ఆనవాళ్లు కనుక్కోవాలని భావించారు. డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా అతని విషయాలను తెలుసుకుందామన్న ఆలోచనతో.. శవపేటికలో ఉన్న మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బీచ్లో అతని శవం దొరికినా.. అతని వద్ద ఆధారాలు లేకపోవడంతో.. అప్పట్లో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కానీ అతనికి లింకు ఉన్న ఓ సూట్కేసును ఆ తర్వాత అడిలైడ్ స్టేషన్లో గుర్తించారు. దాంట్లో ఉన్న లేఖలను చదివారు. అతని వివరాలు తెలియలేదు కానీ.. అతని వద్ద ప్రేమలేఖలు ఉన్నట్లు గుర్తించారు. బహుశా భగ్న ప్రేమికుడై మరణించి ఉంటారని కొందరు భావించారు. కొందరు మాత్రం అతను ఓ గూఢచారి అయి ఉంటాడని అనుమానించారు. అతని వద్ద ఉన్న ఓ చిట్టలో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు అప్పట్లో కూపీ లాగే ప్రయత్నం చేశారు. ఆ ఫోన్ నెంబర్ జెస్సీ అనే మహిళదని గుర్తించారు. కానీ ఆమెను విచారించిన పోలీసులకు .. అనుమానాస్పద రీతిలో మరణించిన ఆ వ్యక్తి గురించి ఏమీ చెప్పలేకపోయంది. జెస్సీ అనే మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే అతని డీఎన్ఏతో ప్రస్తుతం .. పోలీసులు ఆ నాడు చనిపోయిన వ్యక్తి డీఎన్ఏతో పోల్చాలని భావిస్తున్నారు. డీఎన్ఏ సేకరణ ద్వారా ఆ వ్యక్తి ఎక్కడ నుంచి వచ్చాడు, అసలు ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకోవచ్చు అని ఆసీస్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
నిజానికి ఆస్ట్రేలియాలో ఆపరేషన్ పర్సీవర్ పేరుతో అక్కడ తాజాగా ఓ ఆపరేషన్ చేపట్టారు. గుర్తు తెలియని వాటికి పేరు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే 70 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి.. అతని ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. దాని కోసం శ్మశానవాటికలో ఉన్న శవపేటికను తొవ్వారు.