భారత్- పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఎహసాన్ మణి సంచలన వ్యాఖ్యలు చేవారు. బీసీసీఐని పూర్తిగా అధికార బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, బీజేపీయే బీసీసీఐని నడిపిస్తోందంటూ ఆరోపణలు చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అయినా… బీసీసీఐ కార్యదర్శి ఎవరో? అందరికీ తెలిసిందే కదా అని అన్నారు. భారత హోంశాఖ మంత్రి అమిత్షా కుమారుడు జైషా ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శి అని, ఒకరిద్దరి మంత్రుల సోదరులు కూడా కోశాధికారులుగా ఉన్నారని ఎహసాన్ మణి పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పునరుద్ధరణ జరగాలంటే భారత్ వెనుక మేమెందుకు పడాలి? అంటూ ప్రశ్నించారు. భారత జట్టే పాక్కు వచ్చి ఆడాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. తమతో ఆడాలని భారత జట్టు భావిస్తే, ఆ ప్రతిపాదనతో భారతే ముందుకు రావాలని, ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పానని ఎహసాన్ మణి చెప్పుకొచ్చారు.
ఇరు దేశాల జట్లు క్రికెట్ ఆడతామంటే తానెన్నడూ వ్యతిరేకించలేదని, అయితే.. తమకు కూడా ఆత్మాభిమానం అంటూ ఒకటి ఉంటుంది కదా.. అని వ్యాఖ్యానించారు. తమతో క్రికెట్ ఆడడానికి భారత్ ముందుకు వస్తే తామెందుకు పారిపోతాం? తాము కూడా భారత్తో క్రికెట్ ఆడతామని ఎహసాన్ మణి ప్రకటించారు.