బీజింగ్: చైనాలో గత ఏడాది శిశు జనన రేటు దారుణంగా పడిపోయింది. ప్రతి వెయ్యి మందిలో ఆ రేటు 7.52 శాతం తగ్గినట్లు ఆ దేశ జాతీయ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా పేర్కొన్నది. ముగ్గురు పిల్లలు కనేందుకు ప్రభుత్వం గత ఏడాది అనుమతి ఇచ్చినా.. ఆ దేశంలో బర్త్ రేటు రికార్డు స్థాయిలో పడిపోవడం శోచనీయం. ఒక జంటకు ఒకే శిశువు అన్న నియమాన్ని 2016లో చైనా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఒక జంట ఇద్దర్ని కనవచ్చు అని డ్రాగన్ ఆ ఏడాదిలోనే ఆదేశాలు జారీ చేసింది.
వృద్ధ జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చైనా ఆ నిర్ణయం తీసుకున్నది. కానీ ప్రస్తుతం పట్టణాల్లో ఉన్న జీవనశైలి దృష్ట్యా.. ఆ దేశంలో జనన రేటు మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 1949 నుంచి అత్యల్ప స్థాయిలో జనన రేటు నమోదు అయినట్లు ఆ దేశ గణాంకాల శాఖ వెల్లడించింది. చైనా జనాభా గత ఏడాది కేవలం 0.034 శాతమే పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 1960 నుంచి ఇదే అత్యల్పం అని ఆ దేశ డేటా చెబుతోంది.
భౌగోళిక సమస్యలు ఎన్ని ఉన్నా.. వృద్ధ జనాభా పెరుగుతున్న తీరు ఆందోళనకంగా ఉన్నట్లు చీఫ్ ఎకానమిస్ట్ జివీ జాంగ్ తెలిపారు. ఈ లెక్కలను గమనిస్తే, 2021లోనే చైనాలో జనాభా అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోందని జాంగ్ చెప్పారు. 2021లో సుమారు 10.62 మిలియన్ల జననాలు సంభవించాయి. అయితే 2020లో ఆ సంఖ్య 12 మిలియన్లుగా ఉన్నట్లు గణాంకాల శాఖ తెలిపింది. 2020లో ప్రతి వెయ్యి మందిలో 8.52 శాతం జనన రేటు ఉన్నట్లు తెలిపారు.