Britain strike | క్రిస్మస్ వేళ బ్రిటన్లో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మెలో బస్సు, రైల్వే, విమానం, అంబులెన్స్, నర్సింగ్, పోస్టల్, టీచింగ్ సిబ్బంది సహా వివిధ విభాగాలకు చెందిన రెండుల లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఫలితంగా అన్ని రకాల సేవలు బ్రిటన్లో నిలిచిపోనున్నాయి. సమ్మె కారణంగా స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 30 ఏండ్లలో ఇదే అతిపెద్ద సమ్మెగా భావిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈ సమ్మె జరుగుతుండటంతో ప్రజలు ఎక్కడికీ వెళ్లాలేక, ఏమీ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్కు ఈ సమ్మె ఒక ఛాలేంజ్గా నిలించిందని రాజకీయ, ఆర్థిక పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రధాన రోడ్లన్నీ ఆందోళనాకారులతో నిండిపోయాయి. ప్రతి శాఖ ఉద్యోగులకు వేర్వేరు డిమాండ్లు ఉండగా.. అందరి ఉమ్మడి డిమాండ్ మాత్రం జీతాలు పెంచడం. ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో పెరుగుతుందో.. తమ జీతాలు అదే వేగంతో పెరగడం లేదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం రేటు 11.1 శాతంగా ఉన్నది. కాగా, నర్సింగ్ సిబ్బంది జీతం 4.75 శాతం, అంబులెన్స్ సిబ్బంది జీతం 4 శాతం పెరిగింది. పోస్టల్ ఉద్యోగులకు 9 శాతం వేతన పెంపును ఆఫర్ చేయగా వారు తిరస్కరించారు. తొలుత డిసెంబర్ 7 న ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు. జీతం పెంచడంతో పాటు పించన్ పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్.
గాట్విక్, హీత్రో, మాంచెస్టర్, బర్మింగ్హామ్, గ్లాస్గో, కార్డిఫ్లలో విమానాశ్రయ సిబ్బంది కూడా సమ్మెకు దిగుతున్నారు. వీరు డిసెంబర్ 23 నుంచి 26 వరకు, తిరిగి డిసెంబర్ 28 నుంచి 31 తేదీలలో సమ్మెలో ఉంటారు. సమ్మె ప్రభావాన్ని నివారించేందుకు ఎయిర్పోర్టులు, ఓడరేవుల వద్ద సైన్యాన్ని మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 40 వేల మంది రైల్వే కార్మికులు డిసెంబర్ 13 నుంచి 17 వరకు సమ్మె చేయనున్నారు. డిసెంబరు 15, 20 తేదీల్లో దాదాపు లక్ష మంది నర్సులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. డిసెంబరు 21, 28 తేదీల్లో 10 వేల మంది అంబులెన్స్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. ఇంతకు ముందు దాదాపు 30 ఏండ్ల క్రితం 1989 లో ఇంత పెద్ద ఎత్తున సమ్మె జరిగింది.