వాషింగ్టన్: కాబూల్ ఎయిర్పోర్టు వద్ద వచ్చే 24 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడులు జరగడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అందువల్ల కాబూల్ ఎయిర్పోర్టును పౌరులు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తమ సైనికాధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. గురువారం సాయంత్రం కాబుల్ విమానాశ్రయంలో ఐసిస్ జరిపిన దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందారని, వారిలో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారని తెలిపారు.
కాగా, ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్ దాడులు ఇదే చివరిది కాదని, మరిన్ని దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్స్ (ఐఎస్ఎస్) ఉగ్రవాదులకు బైడెన్ హెచ్చరికలు జారీచేశారు. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జరిపిన డ్రోన్ దాడులే చివరికావని, ముందుముందు ఇలాంటివి దాడులు చాలా జరుగుతాయని పేర్కొన్నారు. కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తమ సైనికుల మరణాలకు ప్రతీకారంగా అమెరికా దాడికి దిగిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్లోని నంగాహర్లో ఇస్లామిక్ స్టేట్-ఖోరసాన్ (ఐఎస్-కే) స్థావరాలపై శుక్రవారం డ్రోన్లతో దాడులు నిర్వహించింది. ఇందులో ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాది హతమైనట్టు అమెరికా తెలిపింది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ కాబూల్ నుంచి పౌరుల తరలింపు కొనసాగుతున్నదని బైడెన్ వెల్లడించారు. శనివారం మరో 6800 మందిని అక్కడి నుంచి తరలించామని, అందులో వేలసంఖ్యలో అమెరికన్లు కూడా ఉన్నారని చెప్పారు. తమ సైనికులు ఆఫ్ఘన్ను విడిచివెళ్లేకంటే ముందు పౌరుల తరలింపునకు సంబంధించిన విషయాలను సైన్యాధికారులతో చర్చించినట్లు ఆయన తెలిపారు.