వార్సా: ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న పోలాండ్ గ్రామంలో ఇవాళ మిస్సైల్ దాడి జరిగింది. ఆ దాడిలో ఇద్దరు మరణించారు. ఈ ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పోలాండ్లో పడిన మిస్సైల్ను రష్యా ప్రయోగించి ఉండదని అన్నారు. ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 సదస్సులో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పౌరులపై రష్యా చేస్తున్న బాంబు దాడులు కిరాతకమని బైడెన్ అన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం పోలాండ్లో పడ్డ మిస్సైల్ను ఉక్రెయిన్ నుంచి ఫైర్ చేసినట్లు గుర్తించారు. రష్యా క్షిపణిని పేల్చేవేసే క్రమంలో ఉక్రెయిన్ దళాలు మిస్సైల్ను ప్రయోగించాయి. అయితే ఆ క్షిపణి పోలాండ్లో పడినట్లు అంచనా వేశారు. పోలాండ్లోని ప్రెడోడో గ్రామంలో ఆ క్షిపణి ఓ బిల్డింగ్ను ధ్వంసం చేసింది.
మంగళవారం ఉక్రెయిన్పై జరిగిన క్షిపణి దాడుల్ని జెలెన్స్కీ ఖండించారు. యుద్ధాన్ని అంతం చేయాలన్న ఆలోచన రష్యాకు లేదని ఆరోపించారు. సుమారు 90 మిస్సైళ్లను రష్యా ప్రయోగించినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఆ దాడుల వల్ల విద్యుత్తు కేంద్రాలు, వ్యాపార, నివాస భవనాలు దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు.