బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో కోవిడ్ పరీక్షలను ఉదృతం చేయనున్నారు. మరో మూడు రౌండ్ల సామూహిక పరీక్షలను ఇవాళ్టి నుంచి చేపట్టనున్నారు. ఆదివారం వరకు 12 జిల్లాలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. తాజాగా కోవిడ్19 విస్తరిస్తున్న నేపథ్యంలో చైనా సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. బీజింగ్లోని అర్బన్, శివారు జిల్లాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నారు. డాంగ్చెంగ్, జీచెంగ్, చావోయాంగ్, హైదియాన్, ఫెంగ్తాయి, షిజింగ్షాన్, ఫంగ్షాన్, టాంగ్జోవో, సునీ, చాంగ్పింగ్, డాక్సింగ్ జిల్లాలో కోవిడ్ న్యూక్లియక్ యాసిడ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. స్థాన ప్రజలు ఎక్కువగా తిరగడం మానివేయాలని బీజింగ్ మున్సిపల్ అధికారులు తెలిపారు. గురువారం రోజున ఆ నగరంలో కొత్తగా 36 కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్ 22 నుంచి బీజింగ్లో ఇప్పటి వరకు 928 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నగరంలో 17 కోవిడ్19 హై రిస్క్ ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.