న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై ఇద్దరు కాషాయ నేతల విద్వేష వ్యాఖ్యలపై పలు ఇస్లామిక్ దేశాలు భగ్గుమనగా బంగ్లాదేశ్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని, ఇతర ముస్లిం దేశాల తరహాలో బంగ్లాదేశ్లో ఈ అంశం పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించదని చెప్పారు.
ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వం రాజీ ధోరణితో వ్యవహరిస్తున్నదన్న విమర్శలను బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్ మహ్మద్ తోసిపుచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై భారత్ చర్యలు చేపట్టిందని, మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి ఖండనార్హమైనవని స్పష్టం చేశారు. ఈ అంశంపై భారత్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, తదుపరి చర్యలు కూడా చేపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బంగ్లా ప్రభుత్వం రాజీపడలేదని, అలా ఎన్నటికీ జరగదని అన్నారు. బహిరంగ కార్యక్రమంలోనే తాను ఈ వ్యాఖ్యలను ఖండించానని గుర్తుచేశారు. ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంశం భారత్ అంతర్గత వ్యవహారమని మంత్రి పునరుద్ఘాటించారు.