Bangladesh Hindu : బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోతుంది అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. హిందువుల్లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్ అనే వృద్ధ నేత శనివారం మరణించాడు. పోలీసు కస్టడీలో ఉన్న అతడు అనారోగ్యం కారణంగా మరణించినప్పటికీ, అతడి మరణంలో అక్కడి పోలీసు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రమేష్ చంద్రసేన్ (85) కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. హిందువుల్లో కీలక నేతగా ఉన్నారు. ఐదుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. చివరగా 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా గెలిచారు.
గతంలో షేక్ హసీనా ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. అయితే, 2024లో బంగ్లాలో జరిగిన తిరుగుబాటు, హసీన ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో రమేష్ చంద్ర కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయనపై కూడా హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన పోలీసు కస్టడీలో భాగంగా డినాజ్పూర్ జైలులో ఉన్నాడు. వృద్ధాప్యం రీత్యా పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అక్కడి మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, జైలులో అతడికి అందాల్సిన వైద్య సహాయం అందలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కేంద్ర మాజీ మంత్రి, ఎంపీగా చేసిన వ్యక్తికి నిబంధనల ప్రకారం అందాల్సిన వైద్య సహాయాన్ని జైలు అధికారులు అందించలేదని సమాచారం. జైలులో అతడిని అనేక ఇబ్బందులకు గురి చేశారని అతడి సన్నిహితులు, అవామీ లీగ్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
రమేష్ చంద్ర మరణాన్ని స్థానికులు, ఆయన సన్నిహితులు ప్రిజన్ మర్డర్, కస్టోడియల్ కిల్లింగ్గా అభివర్ణిస్తున్నారు. ఆయన అనారోగ్యం వల్ల మరణించలేదని, ఆయనను కావాలనే హత్య చేశారని సన్నిహితులు విమర్శిస్తున్నారు. రమేష్ చంద్ర మంచి వ్యక్తిగా పేరుంది. కల్మషం లేని మనిషిగా, అందరికీ సహాయం చేసే వ్యక్తిగా రమేష్ చంద్ర పేరు తెచ్చుకున్నాడు. అయితే, ప్రస్తుతం రమేష్ మరణం మరోసారి బంగ్లాదేశ్లో హిందువుల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే అక్కడ జరిగిన దాడుల్లో పలువురు హిందువులు మరణించిన సంగతి తెలిసిందే.