కీవ్: ఉక్రెయిన్లో పౌరుల వాహనాలపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ సంఘటనలో 20 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్లోని కుపియాన్స్క్ పట్టణంలో పలు వాహనాల్లో వెళ్తున్న జనంపై బాంబు దాడులు జరిగాయని ఖార్కివ్ ప్రాంత గవర్నర్ ఒలేగ్ సినెగుబోవ్ శనివారం తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం కనీసం 20 మంది ప్రజలు ఆయా వాహనాల్లో చనిపోయినట్లు చెప్పారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పలు కార్లు, వ్యాన్లలో వెళ్తున్న పౌరులపై రష్యా సైనికులు దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ క్రూరత్వాన్ని ఎవరూ సమర్థించరని అన్నారు.
మరోవైపు ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి చేస్తున్నది. దీనిని తట్టుకోలేని రష్యా సైనికులు కొన్ని ప్రాంతాల నుంచి పారిపోతున్నారు. ఇందులో భాగంగా రష్యా సైన్యం వీడిన కుపియాన్స్క్ ప్రాంతంలో రోడ్డుపై ఆరు వాహనాలు దాడికి గురైనట్లు ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. సుమారు 11 మంది పౌరుల మృతదేహాలు కాలిన వాహనాల్లో కనిపించినట్లు చెప్పింది. కొన్ని మృతదేహాలు కాలిపోయి ఉన్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైన చిన్న వ్యాన్లో కాలిన స్థితితో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించింది. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పేర్కొంది.