సనా: రంజాన్ సందర్భంగా గురువారం నిర్వహించిన వితరణ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకున్నది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మంది మరణించారు. 322 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు సమీప దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. యెమెన్ హోంశాఖ అధికార ప్రతినిధి కథనం ప్రకారం కొందరు వ్యాపారులు రంజాన్ సందర్భంగా ఒక్కో పేద ముస్లింకు 5 వేల యెమెని రియల్స్ (రూ.740) ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడంతో ఒక ప్రైవేట్ పాఠశాలలో భారీగా జనం గుమికూడారు.
ఈ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఈ విషాదం చోటుచేసుకున్నది. ప్రజలు సాయం కోసం పరుగెత్తడం, చనిపోయినవారు కింద పడిపోవడానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పేదల మరణాలకు కారణమైన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.