జ్యూరిచ్: ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు 25వ రోజుకు చేరాయి. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్లో భారీగా ప్రజలు మరణిస్తున్నారు. ఈక్రమంలో మార్చి 18 నాటికి ఉక్రెయిన్లో 847 మంది పౌరులు మృతిచెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇందులో సుమారు 1399 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం (OHCHR) తెలిపింది. రాకెట్ దాడుల, క్షిపణి దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ వల్లే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది. కాగా, వాస్తవ సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు. యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న పట్టణాలకు సిబ్బంది వెల్లలేకపోయారని, బాధితుల సంఖ్యను లెక్కించడం కష్టంగా మారిందని చెప్పారు. దీంతో యుద్ధ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
కాగా, ఉక్రెయిన్లో రష్యా దాడుల వల్ల ఇప్పటివరకు 112 మంది పిల్లలు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. మరో 140 మంది గాయపడినట్లు తెలిపింది.
ఉక్రెయిన్పై రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకున్నదని బ్రిటన్ ఆరోపించింది. రష్యా తీరుతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యన్ సైనికులు భీకరమైన దాడులు జరుపుతుండటంతో మరియుపోల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. దాడులు ఇలాగే కొనసాగితే పోర్టు సిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.