క్వెట్టా: పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రావిన్స్లోని కాచి, హర్నాయ్, పిషిన్, ఖుజ్దార్, కెచ్ అండ్ పంజ్గూర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ వర్షాలవల్ల వరదలు పోటెత్తి ఏడుగురిని బలితీసుకున్నాయి. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బోస్టెన్ తహసీల్లోని కిల్లీ రేగి ఏరియాలో ఇల్లు కూలి తండ్రి, నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
కెచ్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న ముర్గ్ అబ్ నదిలో 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక వ్యాన్ కొట్టుకుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన రక్షణ సిబ్బంది ఏడుగురిని ప్రాణాలతో వెలికితీశారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. అదేవిధంగా వరదల ధాటికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోవడంతో ప్రావిన్స్లోని వివిధ పట్టణాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.