కాబూల్, ఏప్రిల్ 22: అఫ్గానిస్థాన్ మరోసారి నెత్తురోడింది. కుందుజ్ ప్రావిన్స్ ఇమాం సాహెబ్ పట్టణంలో ఉగ్రవాదులు శుక్రవారం బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. మసీదు, మదర్సాలే లక్ష్యంగా ఈ దాడులు చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులతో సహా మొత్తం 33 మంది మరణించారని, మరో 43 మంది గాయాలయ్యాయని తాలిబన్ అధికారులు తెలిపారు.
గురువారం కూడా షియా ముస్లింలే లక్ష్యంగా మూడుచోట్ల బాంబు దాడులు జరిగాయి. ఆయా ఘటనల్లో 14 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం దాడులు తామే చేసినట్టు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ సంస్థ పేర్కొనగా, తాజాగా మసీదు, మదర్సాలపై జరిగిన దాడులపై ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అఫ్ఘానిస్థాన్లో ఇస్లామిక్ స్టేట్ క్రియాశీలకంగా మారింది.