కాబూల్: అఫ్గానిస్థాన్ను (Afghanistan) భారీ భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారు జామున వచ్చిన భూకంపం వల్ల 255 మందికిపైగా మరణించారు. ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. 51 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని ప్రకటించింది.
భూకంపం ధాటికి పక్టికా ప్రావిన్స్లో వంద మంది మృతిచెందారని, 250 మంది గాయపడ్డారని తాలిబన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెడ్ మహమ్మద్ నసీమ్ హఖ్ఖానీ తెలిపారు. ఖోస్ట్, నంగార్హర్ ప్రావిన్సుల్లో కూడా పెద్ద సంఖ్యలో మరణించారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు.
కాగా, పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఖ్వెట్టాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 2.24 గంటల సమయంలో భూమి కంపించిందని తెలిపింది.
UPDATE | An earthquake struck eastern Afghanistan early Wednesday, killing at least 255 people, authorities said: The Associated Press
— ANI (@ANI) June 22, 2022