Asif Zardari : ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్ (India) ను కవ్వించడానికి పాకిస్థాన్ (Pakistan) ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బాధ్యతలను ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) తీసుకున్నాడు. తమ దేశంతో మరో యుద్ధం చేయడానికి భారత్ సన్నాహాలు చేస్తోందని అనుచిత ఆరోపణ చేశాడు. సింధూ జలాల ఒప్పందం రద్దుపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయ అవసరాల కోసం భారత్ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నదని అక్కసు వెళ్లగక్కారు.
ప్రాంతీయ శాంతికి మద్దతుదారుగా తాను ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నానని జర్దారీ తెలిపారు. భారత అధికారులు యుద్ధం చేయాలన్న ఆలోచనల నుంచి వెనక్కి తగ్గి తమతో చర్చలకు రావాలని అన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి, కశ్మీర్లోని ప్రజలకు అవసరమైన దౌత్యపరమైన సాయాన్ని అందించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అదేవిధంగా పాకిస్థాన్లో శాంతిని అస్థిరపరిచేందుకు అఫ్గాన్ ప్రయత్నాలు చేస్తోందని, వాటిని అడ్డుకోవడానికి తమ దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.
అదేవిధంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణను జర్దారీ ఖండించారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. యూఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం సరైన చర్య కాదన్నారు.