Apple vs Twitter | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్పై ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపిల్ స్టోర్ నుంచి ట్విట్టర్ను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ట్విట్టర్ను బ్లాక్ చేసేందుకు ఆపిల్ అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తోందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఐఫోన్ తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ల్లో ప్రకటనలను నిలిపివేసిందని తెలిపారు. కంటెంట్ మోడరేషన్ పేరుతో ఆపిల్ ట్విట్టర్పై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.
అయితే, ఇంతకు ముందు Gab, Parlour వంటి యాప్లను ఆపిల్కు ఇంతకు ముందు తొలగించింది. యాప్ కంటెంట్ మోడరేషన్ను అప్డేట్ చేసిన అనంతరం 2021లో ఆపిల్ పార్లర్ యాప్ను పునరుద్ధరించింది. అయితే, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ను ట్యాగ్ చేస్తూ ఎలాన్ మస్క్ పలు ప్రశ్నలు సంధించారు. ‘అమెరికాలో ఫ్రీ స్పీచ్ ఉండడం ఆ సంస్థకు నచ్చదా? ఏం జరుగుతోంది టిమ్ కుక్?’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు దీనిపై ఆపిల్ స్పందించలేదు.
అడ్వటైజ్ డేటాబేస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కంపెనీ పాత్మాటిక్స్ ప్రకారం.. నవంబర్ 10 మరియు 16 మధ్య ట్విటర్ ప్రకటనల కోసం 131,600 డాలర్లను ఖర్చు చేసింది. ఇంతకు ముందు అక్టోబర్ 16 -అక్టోబర్ 22 220,800 డాలర్లుగా ఉండేది. మరో వైపు యాప్ స్టోర్ లావాదేవీల్లో ఆపిల్కు 30శాతం ఫీజు చెల్లించాలని నిబంధన ఉండగా.. ఇప్పటికే వ్యతిరేకత ఉన్నది. దీనిపై సైతం ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. ‘ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసే ప్రతిదానిపై రహస్యంగా 30 శాతం పన్ను విధిస్తుందని మీకు తెలుసా?’ అంటూ ట్వీట్ చేశారు. మరి దీనిపై ఆపిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.