Clash @ iPhone plant | చైనాలోని యాపిల్కు చెందిన ఐఫోన్ ప్లాంట్లో ఆందోళనలు మిన్నంటాయి. జీరో కోవిడ్ పాలసీ పేరిట పెట్టిన ఆంక్షలకు విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆందోళనలతో యాపిల్ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
చైనాలోని జెంగ్జూ ప్రాంతంలో యాపిల్ తయారీ కేంద్రం ఫాక్స్కాన్ ప్లాంట్ ఉన్నది. ఇక్కడ ఐఫోన్లు తయారుచేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది ఇంటి ముఖం చూడక చాలా రోజులైందని అక్కడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కొవిడ్తో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
1/2 Breaking: Newly recruited #Foxconn workers in #iPhone city in #Zhengzhou, #CCPChina try to break out of Foxconn as they say they are deceived. Foxconn didn't separate them from older employees who could be #COVID positive, and the contracts they were asked to sign are… pic.twitter.com/FqmRfwZMk7
— Jennifer Zeng 曾錚 (@jenniferzeng97) November 22, 2022
ఆందోళనకు దిగిన కార్మికులను అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాటతో కొంతసేపు ఘర్షణ వాతావారణం నెలకొన్నది. అల్లర్లను నిరోధించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఐఫోన్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది కార్మికులు గాయపడినట్లు తెలుస్తున్నది. అక్టోబర్ నెలలో లాక్డౌన్ తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి సెంట్రల్ సిటీ జెంగ్జూ ప్లాంట్లో హింసాత్మక సంఘటనలు అక్కడి ఉద్రిక్తతల తీవ్రతను చాటిచెప్తున్నాయి. ఫాక్స్కాన్ ప్లాంట్లో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా.. వీరిలో అధిక శాతం మంది ఒంటరిగా మగ్గుతున్నారు. మందులు, భోజనం కోసం వారు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొనడం విశేషం.