వాషింగ్టన్, ఫిబ్రవరి 15: భారత సంతతికి చెందిన మరో వ్యక్తి అమెరికాలో హత్యకు గురయ్యాడు. ప్రవీణ్ రావ్జీభాయ్ పటేల్(76) అనే హోటల్ యజమానిని ఓ వినియోదారుడు కాల్చి చంపిన ఘటన అమెరికాలోని అలబామాలో జరిగింది. షెఫ్ఫీల్డ్ పోలీస్ చీఫ్ రికీ టెర్రీ కథనం ప్రకారం షెఫ్ఫీల్డ్లో రోడ్డు పక్కన ప్రవీణ్ హిల్క్రెస్ట్ హోటల్ నిర్వహించేవారు. గతవారం విలియం జెరెమీ మూర్(34) అనే కస్టమర్ అద్దె గది కోసం అతడి హోటల్కు వచ్చాడు.
అద్దె విషయంలో వాగ్వాదం తలెత్తడంతో కోపోద్రిక్తుడైన మూర్ వెనక్కు వెళ్లి తన తుపాకీ తెచ్చి పటేల్ను కాల్చి చంపాడు. అనంతరం ఒక ఖాళీ ఇంట్లో దాక్కోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పటేల్ హత్యను ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ఖండించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇటీవల అమెరికాలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులపై దాడులు జరగడం ఎన్నారైల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది.