బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతుండటం కలకలాన్ని రేపుతున్నది. తాజాగా చైనా రక్షణ శాఖ మంత్రి లీ షాంగ్ఫూ పత్తా లేకుండా పోయారు. దాదాపు రెండు వారాల నుంచి ఆయన కనిపించడం లేదని జపాన్లోని అమెరికా రాయబారి రహ్మ్ ఇమ్మాన్యుయేల్ ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. షాంగ్ఫూ చివరిసారిగా గత నెల 29న బీజింగ్లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో కనిపించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్, పీఎల్ఏ రాకెట్ ఫోర్స్కు చెందిన ఇద్దరు కమాండర్లు అదృశ్యమయ్యారు.