ఇజ్రాయెల్లో బయటపడిన 1,800 ఏండ్లనాటి సమాధి
జెరూసలెం, జూన్ 15: ప్రాచీన సమాధులను తవ్వే శాస్త్రవేత్తలు నెత్తురు కక్కుకొని మరణించిన ‘మమ్మీ’ తరహా సినిమా కథలు కోకొల్లలు. నమ్మేవారు నమ్ముతారేమోగానీ ఇవేవీ శాస్త్ర పరీక్షకు నిలిచేవి కావు. తాజాగా ఓ సమాధి ఫలకంపై రాసిన హెచ్చరిక సంచలనం కలిగిస్తున్నది. ఇజ్రాయెల్లోని గలీలీ ప్రాంతంలో గల బెయిట్ షెయారిమ్ యూదు ఖననవాటికలో ఇటీవల పురావస్తు శాస్త్రజ్ఞులు ఓ గుహను కనుగొన్నారు. అందులో బయటపడిన సమాధి రాతి పలకపై ఓ హెచ్చరిక రాసి ఉంది. ‘ఈ సమాధిని ఎవరైనా తెరిస్తే శాపానికి గురవుతారు. ఇది మతాంతరీకరణ పొందిన జాకబ్ ఆన’ అని తెల్లని రాతిపలకపై ఎర్రని అక్షరాలతో భయానకంగా రాసిన ఆ హెచ్చరిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
జాకబ్ బహుశా రోమన్ సామ్రాజ్యం చివరి రోజుల్లో లేదా బైజాంటియం యుగం తొలినాళ్లకు చెందిన 1,800 ఏండ్లనాటి ఆ సమాధిపై జాకబ్ వయసు చనిపోయేనాటికి 60 సంవత్సరాలని కూడా రాసి ఉంది. ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వార్త వెలువరించారు. దీనిపై నెటిజనులు బోలెడు నవ్వు పుట్టించే కామెంట్లు పెట్టారు. ‘ఎవరైనా తవ్వి చూశారా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి’.. అని ఒకరు అంటే ‘సమాధిని తవ్వితే శాంతియుతమైన ఆవలి ప్రపంచానికి దారి దొరుకుతుందేమో’.. అని మరొకరు వ్యాఖ్యానించారు.