న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్), పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై దాడి జరిగినట్లుగా పరిగణించాల్సి ఉంటుంది. భద్రతను పటిష్టం చేసుకోవడం, ప్రపంచ శాంతి కోసం కృషి చేయడంపై తమ రెండు దేశాల అంకితభావాన్ని ఈ ఒప్పందం ప్రతిఫలిస్తుందని సౌదీ, పాక్ బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నట్లు సౌదీ వార్తాసంస్థ తెలిపింది. రెండు దేశాల మధ్య మరింత బలమైన రక్షణ సహకారానికి ఇది పునాదిగా సంయుక్త ప్రకటన అభివర్ణించింది. ఒప్పందంపై సంతకాలు చేసిన కార్యక్రమంలో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్తోపాటు ఉప ప్రధాని ఇషాక్ దర్, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఆర్థిక మంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాల్గొంది.
అవసరమైతే పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వస్ర్తాలు కూడా సైనిక సహకారంలో భాగంగా ఒప్పంద పరిధిలోకి రావచ్చని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఇది లాంఛనంగా కుదిరిన ఒప్పందం కాదని, వ్యూహాత్మకంగా రెండు దేశాలు చేతులు కలపడంతో ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడిందని అమెరికా మాజీ దౌత్యవేత్త జల్మే ఖలీజద్ వ్యాఖ్యానించారు. ఒప్పందంలో రహస్య నిబంధనలు ఏవైనా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇక సౌదీ అరేబియాకు అమెరికా భద్రతా హామీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోగలదని అభిప్రాయపడ్డారు. కాగా, సెప్టెంబర్ 9న దోహాలో హమాస్ నాయకుడు ఖలీల్ అల్-హయ్యాపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి స్పందనగా 14న ముస్లిం, అరబ్ దేశాల నాయకులు దోహాలో సమావేశమై ఇస్లామిక్ దేశాలు కూడా నాటో తరహాలో ఓ రక్షణ కూటమిని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం భారత ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారతదేశ జాతీయ భద్రత, ప్రాంతీయ సుస్థిరతపై ఈ ఒప్పందం ప్రభావాలను భారత్ అంచనావేస్తుందని ఆయన చెప్పారు. స్వీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో భారత్ పూర్తిగా కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఇది భారత భద్రతకు తీవ్ర ఆందోళనకరమైన విషయమని, మోదీ వ్యక్తిగత కాంక్షతో సాగిస్తున్న దౌత్యానికి మరో వైఫల్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ను అర్ధాంతరంగా ఆపేసిన నెలరోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ని వైట్ హౌస్కి పిలిపించి మరీ ఆతిథ్యమిచ్చారు.
ప్రధాని మోదీ ఆర్భాటంగా చేసిన చైనా పర్యటన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనాకు చెందిన రహస్య సైనిక సముదాయాన్ని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కోసం తెరిచారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో ఉండగా ఇప్పుడు అదే పాక్తో అదే సౌదీ వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది నిస్సందేహంగా భారత జాతీయ భద్రతకు తీవ్ర ఆందోళనకరమైన విషయం’ అని అన్నారు.