Russia | మాస్కో, ఏప్రిల్ 17: రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక నెల వయసుండే తన సొంత కొడుకుపైనే ప్రయోగాలు చేసి, అతని ప్రాణాలు తీశాడు. మనిషికి అసలు ఆహారం అవసరం లేదని, కేవలం సూర్యరశ్మితో సూపర్మ్యాన్ సామర్థ్యం వస్తుందని తన ఫాలోవర్లను నమ్మించేందుకు.. కొడుకు తన తల్లి పాలు తాగకుండా నిరోధించి మూర్ఖంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి న్యూమోనియా, పోషకా హారలోపంతో తీవ్ర అనార్యోగం పాలై మరణించాడు. గత ఏడాది జరిగిన ఈ ఘటనలో మాక్సిమ్కు స్థానిక కోర్టు తాజాగా ఎనిమిదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య ఒక్సానా మిరోనివా ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేందుకు కూడా మాక్సిమ్ నిరాకరించడంతో..
ఆమె ఇంట్లోనే బిడ్డను కనాల్సి వచ్చింది. అయితే ఒక్సానా తన బిడ్డకు మాక్సిమ్కు తెలియకుండా పాలు పట్టించేందుకు ప్రయత్నించేదని, అయితే తన భర్త అంటే చాలా భయపడేదని ఒక్సానా బంధువులు పేర్కొన్నారు. మాక్సిమ్ మూర్ఖంగా చేపట్టిన ప్రయోగం వల్ల బిడ్డ అనారోగ్యం పాలైనప్పటికీ, దవాఖానకు తీసుకెళ్లనిచ్చే వాడు కాదని, పైగా చల్ల నీళ్లతో స్నానం చేయిస్తే.. శరీరం బలపడుతుందంటూ అందులో ముంచేవాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, విచారణలో మొదట తాను చేసిన తప్పును ఒప్పుకోని మాక్సిమ్.. చివరకు తన బిడ్డ మరణానికి తానే కారణమని కోర్టు ముందు ఒప్పుకొన్నాడు. సూర్యరశ్మే ఆహారం అంటూ తన పిచ్చితో బిడ్డను చంపుకొన్న అతను.. ఇప్పుడు జైల్లో మాంసం, ఇతర ఆహార పదార్థాలు తింటుండటం గమనార్హం.