కొలంబో: శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆ దేశంలో ఆందోళనకారులు విజృంభించారు. త్రికోణమలైలో ఉన్న నావల్ బేస్లో ప్రస్తుతం మహింద రాజపక్స ఆశ్రయం పొందుతన్నట్లు తెలుస్తోంది. మహింద రాజపక్సతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా అక్కడే తలదాచుకుంటున్నారు. రాజధాని కొలంబోకు సుమారు 270 కిలోమీటర్ల దూరంలో త్రికోణమలై నావల్ బేస్ ఉంది. అయితే ఆందోళనకారులు అక్కడ కూడా ప్రదర్శన చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఫ్యామిలీతో కలిసి మాజీ ప్రధాని రాజపక్స నౌకాశ్రయానికి వెళ్లినట్లు భావిస్తున్నారు.
ప్రభుత్వ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలతో శ్రీలంక రణరంగంగా మారింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగిపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు సోమవారం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. అనంతరం నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారులపై దాడులకు దిగారు. వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఎంపీలు, అధికార పార్టీ నేతల ఇండ్లను ముట్టడించారు. హింస కొలంబో నుంచి దేశమంతటికీ విస్తరించింది.