వాషింగ్టన్: అమెరికా సైనికుల చేతిలో హతమైన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 21 ఏళ్ల కిందట రాసిన లేఖ, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాపై ఉగ్ర దాడి తర్వాత అమెరికన్లకు ఒసామా రాసిన ఈ లేఖలో (Osama’s letter to Americans) ‘పాలస్తీనా ఆక్రమణ’ గురించి ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఈ నేపథ్యంలో టిక్టాక్ యూజర్ లినెట్ అడ్కిన్స్ మంగళవారం ఒక వీడియో పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం వారు (ఇజ్రాయెల్, అమెరికా) చేస్తున్న పనిని ఆపాలి. ప్రతి ఒక్కరూ దీనిని చదవడం అవసరం. ఇది రెండు పేజీలు – ‘ఎ లెటర్ టు అమెరికా’ (ఒసామా రాసిన లేఖ)ను చదవండి’ అని అందులో పేర్కొంది.
కాగా, 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై ఉగ్ర దాడిని అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ సమర్థించాడు. ఈ దాడి తర్వాత అమెరికా ప్రజలను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పాల్పడిన అనేక దురాగతాలతోపాటు పాలస్తీనాను ఆక్రమించి ఆ దేశ ప్రజలను అణచివేస్తున్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతివ్వడాన్ని ఇందులో ప్రస్తావించాడు. ‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. సెప్టెంబర్ 11 వరకు మీ (అమెరికా) అధ్యక్షులెవరూ దాని గురించి మాట్లాడలేదు’ అని పేర్కొన్నాడు. ‘పాలస్తీనా బందీగా ఉండదు. దాని సంకెళ్ళను విచ్ఛిన్నం చేయడానికి మేం ప్రయత్నిస్తాం. క్రైస్తవుల రక్తంతో కూడిన దురహంకారానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుంది’ అని ఆ లేఖలో హెచ్చరించాడు.
మరోవైపు ‘అమెరికన్లకు ఒసామా లేఖ’ను ది గార్డియన్ వార్తాపత్రిక 2002 నవంబర్ 24న తన వెబ్సైట్లో ప్రచురించింది. అయితే తాజాగా పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యత పెరిగింది. ఇజ్రాయెల్ను, దానికి మద్దతిస్తున్న అమెరికాను వ్యతిరేకించే వారు ఒసామా లేఖ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 15న వెబ్సైట్ నుంచి ఈ లేఖను గార్డియన్ తొలగించింది. ఆ తర్వాత నుంచి వేలాది మంది టిక్టాక్ యూజర్లు ‘అమెరికన్లకు ఒసామా లేఖ’ను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నారు.