వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఆ దేశంలో భారత్కు (Indians) చెందిన వారిపై ద్వేషపూరిత నేరాల కేసులు పెరిగాయి. భారతీయులను గెంటేయండి, ఇండియన్ గో బ్యాక్ నినాదాలతో ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దక్షిణ ఆసియా సంతతికి చెందిన ప్రజలపై ఆన్లైన్ ద్వేషం, హింస పరిమితంగా ఉండేది. 2024, అక్టోబర్ నాటికి 46 వేలు ట్రోలింగ్, 884 బెదిరింపు కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పరిస్థితి అధ్వానంగా మారింది. 2025, అక్టోబర్ నాటికి 91 శాతం పెరిగి కేసుల సంఖ్య 88 వేలకు చేరుకుంది.
ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్-1బీ వీసా ఫీజు అనూహ్యంగా పెంచడం, 104 మంది భారతీయులను వెళ్లగొట్టడం వంటివి భారతీయులపై ద్వేషానికి ఆజ్యం పోసినట్టయ్యింది. తత్ఫలితంగా కాల్పులు, టెక్సాస్, వర్జీనియా, కాలిఫోర్నియాలలో దేవాలయాలపై దాడులు పెరిగాయి. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అంచనా ప్రకారం ఇటీవలి నెలల్లో జాత్యహంకార పోస్టులు కూడా వేగంగా పెరిగాయి. ట్రంప్ పాలసీల కారణంగా భారతీయులపై జాత్యహంకార, ఆన్లైన్ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిందని తెలిపింది. కేవలం వ్యాఖ్యలకు పరిమితం కాకుండా ఏకంగా దక్షిణాసియా సమాజాన్నే లక్ష్యంగా చేసుకుని ద్వేష ప్రచారం పెరిగింది.
‘దేశం నుంచి భారతీయులను వెళ్లగొట్టండి’ నినాదాలు ఎక్కువయ్యాయి. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలలో వలసదారులపై ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఆగ్రహం జాత్యహంకార ధోరణికి మొదటి ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న మితవాద రాజకీయాల్లో ఈ భావన ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. హెచ్-1బీ వీసా విధానం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. తమకు ఆ ఉద్యోగాలకు తగిన అర్హత లేకపోయినప్పటికీ, అమెరికా పౌరుల ఉద్యోగాలను భారతీయులు ఎత్తుకుని పోతున్నారని మితవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.