రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. 18వరోజు రష్యన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ కన్నుమూయగా, ఒకరు గాయాలపాలయ్యారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ రీజియన్లో రష్యన్ సైనికులు జరిపిన కాల్పుల్లో అవార్డు విన్నింగ్ ఫిలింమేకర్, జర్నలిస్ట్ బ్రెంట్ రేనాడ్ మృతిచెందాడు. అలాగే, అతడి సహచరుడు జాన్ అర్రెడొండో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.
బ్రెంట్ రేనాడ్ టైం స్టూడియోస్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఐడీ, పాస్పోర్టు సాయంతో అతడిని గుర్తించారు. రేనాడ్ ప్రపంచ శరణార్థుల సంక్షోభంపై పనిచేస్తున్నట్లు *ది న్యూయార్క్ టైమ్స్* ఒక ప్రకటనలో తెలిపింది. *బ్రెంట్ రెనాడ్ను కోల్పోయినందుకు మేము చాలా చింతిస్తున్నాం* అని టైమ్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంతల్ వెల్లడించారు.
రెండు దశాబ్దాలుగా రేనాడ్ జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నారు. అతడు పలు దేశాల్లో యుద్ధవాతావరణ సంఘటనల కవరేజీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఆదివారం పోలిష్ సరిహద్దు సమీపంలో రష్యా వైమానిక దాడుల్లో 35 మంది మరణించారు. కాగా, 57 మందికి పైగా గాయపడ్డారు.