Terror accuse caught | 34 ఏండ్ల క్రితం ఉగ్రవాద దాడికి దిగిన వ్యక్తిని ఎట్టకేలకు అమెరికా అధికారులు పట్టుకున్నారు. ఇంటెలీజెన్స్ ఏజెన్సీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈతగాడు తన ఘనకార్యాన్ని పూసగుచ్చినట్లు వివరించడంతో అమెరికా దర్యాప్తు సంస్థ అధికారుల పని సులువైంది. లండన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో పేలుడు జరిగిన ఘటనలో ఇతడు నిందితుడు. ఆనాటి ఘటనలో విమానంలో ఉన్న 259 మంది మరణించగా.. విమాన శకలాలు పడి మరో 11 మంది చనిపోయారు. ఇంగ్లండ్ గడ్డపై ఇదే అతి పెద్ద ఉగ్రవాద దాడిగా పరిగణిస్తున్నారు.
నిందితుడి పేరు అబు అగెలా మసూద్ ఖైర్ అల్-మారిమి అని, అతడు లిబియా నివాసి అని స్కాటిష్, అమెరికా అధికారులు తెలిపారు. అనంతరం వాషింగ్టన్ డీసీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. 2017లో లిబియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మసూద్ ఇచ్చిన ఇంటర్వ్యూను అమెరికా అధికారులు పట్టుకోవడంతో 1988 ఉగ్రవాద దాడి దర్యాప్తు మలుపు తిరిగింది. 2012 లో గడాఫీ ప్రభుత్వం పతనం తర్వాత ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కస్టడీలో మసూద్ ఉన్నాడు.
పాన్ అమెరికా విమానం 103 పై దాడి కోసం బాంబును తానే తయారు చేసినట్లు మసూద్ ఇదే ఇంటర్వ్యూలో అంగీకరించాడు. ఈ పనిలో తనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలిపారు. దాడి చేసినందుకు గడాఫీ తనకు, ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలిపినట్లు మసూద్ చెప్పడాన్ని బట్టి ఈ దాడికి సంబంధించి లిబియా గూఢచార సంస్థ ప్రమేయం కూడా ఉన్నట్లు భావిస్తున్నామని ఎఫ్బీఐ తన అఫిడవిట్లో పేర్కొన్నది.