Alibaba | ఆదాయం తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు లేఆఫ్స్ (LayOffs) ప్రకటిస్తున్నాయి. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, ఐబీఎం, హెచ్పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేశాయి. వందలాది సంస్థలు ఉద్యోగాలను లేఆఫ్స్ చేశాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇలాంటి సమయంలో చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం (Chinese e-commerce platform) అలీబాబా (Alibaba) గ్రూప్ నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది.
భారీ స్థాయిలో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ తన ఆరు ప్రధాన వ్యాపార విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది ఏకంగా 15,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ‘విబో’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజా నియామకాల్లో ఫ్రెషర్స్కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త నియామకాల్లో 3,000 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో అలీబాబా సంస్థలో భారీగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయన్న వార్తలపై ఈ-కామర్స్ దిగ్గజం స్పందించింది. అలీబాబాకు చెందిన క్లౌడ్ విభాగం ఉద్యోగుల తొలగింపు చేపట్టిందని బ్లూమ్బర్గ్ ఇటీవల నివేదించింది. సుమారు 7 శాతం సిబ్బందిని తగ్గించవచ్చని తన నివేదికలో పేర్కొంది. బ్లూమ్బర్గ్ నివేదికపై స్పందించిన అలీబాబా.. ఆ వార్తలను ఖండించింది. ఉద్యోగులు వెళ్లిపోవడం అనేది సాధారణ ప్రవాహంలో భాగమని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ గుబులు కొనసాగుతోంది. గత ఏడాది 1056 కంపెనీలు దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించగా 2023లో కేవలం ఐదు నెలల్లోనే.. అంటే ఈ ఏడాది మే 18 నాటికి దాదాపు 1,97, 985 మంది టెకీలు కొలువులు కోల్పోయారు. లేఆఫ్ ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్.ఎఫ్వైఐ వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ 696 టెక్ కంపెనీలు లేఆఫ్స్కు తెగబడ్డాయి.
రాబోయే రోజుల్లో తమ సంస్థల్లో మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించాయి. ఇక భారత్లో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులకు కత్తెర వేస్తున్నాయి. డుంజో, షేర్చట్, రెబెల్ ఫుడ్స్, భారత్ అగ్రి, ఓలా వంటి పలు కంపెనీలు లేఆఫ్స్కు తెరలేపాయి. యాక్సెంచర్ భారత్ విభాగంలోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.
Also Read..
Woman | 17 ఏళ్ల క్రితం అపహరణకు గురైన యువతి.. నేడు ఢిల్లీలో ప్రత్యక్షం
Karnataka Cabinet | కొలిక్కి వచ్చిన కేబినెట్ కూర్పు.. రేపు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రులు..!
UK PM Rishi Sunak | బ్రిటన్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చిన కారు.. గేట్లను ధ్వంసం చేసి