ట్యూనిస్: ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియా (Algeria).. బ్రిక్స్ (BRICS) కూటమిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నది. కూటమిలో తమకు సభ్యత్వం కల్పించాలని కోరుతున్నది. కూటమికి చెందిన బ్రిక్స్ బ్యాంకులో (BRICS Bank) షేర్హోల్డర్ మెంబర్గా (Shareholder member) ఉంటామని, తమకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నది. 1.5 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ బ్యాంకులో షేర్హోల్డర్ సభ్యుడిగా ఉంటామంటూ అప్లయ్ చేసుకున్నదని మీడియా వర్గాలు వెల్లడించాయి. కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బ్రిక్స్లో చేరాలనుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్మాజిద్ టెబ్బౌన్ (Abdelmadjid Tebboune) తన చైనా (China) పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలను పేర్కొన్నాయి. ఉత్తర ఆఫ్రికాలో చమురు, గ్యాస్ నిక్షేపాలు అల్జీరియాలో సమృద్ధిగా ఉన్నాయి. బ్రిక్స్లో ఆ దేశం ప్రవేశించడానికి ఇప్పటికే చైనా, రష్యాలు మద్దతు ప్రకటించాయి.
కాగా, బ్రిక్స్ 15వ సదస్సుకు దక్షిణాఫ్రిక ఆతిథ్యం ఇస్తున్నది. ఆగస్టు 22 నుంచి 25 వరకు జొహెన్నెస్బర్గ్లో ఈ సమావేశాలకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.. ఈ బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం చేశామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ప్రకటించారు.
కరోనా మహమ్మారి విజృంభన అనంతరం సభ్యదేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్ సమావేశం ఇదే. గత మూడేళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో ఈసారి బ్రిక్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు.