మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) .. సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్దీవదేహాన్ని అప్పగించేందుకు రెండు వారాల సమయం పడుతుందని అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రెండు వారాల తర్వాతే నావల్నీ మృతదేహాన్ని అప్పగించనున్నట్లు అధికారులు చెప్పారు. నావల్నీ శరీరానికి రసాయనిక విశ్లేషణ చేపడుతున్నామని ఆయన తల్లికి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
నావల్నీ పార్దీవదేహం ఎక్కడ ఉందన్న దానిపై మాత్రం రష్యా అధికారులు ప్రకటన ఏమీ చేయలేదు. ఆ ప్రయత్నాలను కూడా రష్యా అధికారులు కొట్టిపారేశారు. నావల్నీ మృతదేహాన్ని దాచిపెట్టారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. తన భర్తను అధ్యక్షుడు పుతిన్ హత్య చేశారని యులియా నవల్నయా తెలిపారు. ఫ్రీ రష్యా ఉద్యమంపై ఆమె ఓ వీడియోను రిలీజ్చేశారు. నరాలను దెబ్బతీసే నోవిచోక్ అనే విషపూరిత ఏజెంట్ ను తన భర్తపై ప్రయోగించారని, శరీరం నుంచి ఆ విషం వెళ్లే వరకు నావల్నీ పార్దీవదేహాన్ని అప్పగించబోరని యులియా ఆరోపించారు.
సైబీరియన్ పీనల్ కాలనీలో ఉన్న నావాల్నీ.. కొన్ని రోజుల నుంచి అస్వస్థత ఉన్నారు. అయితే ఆయన గత శుక్రవారం మరణించినట్లు అధికారులు చెప్పారు. జైలులో వాకింగ్కు వెళ్లిన నావల్నీ కింద కూలిపడ్డారు. ఆ తర్వాత ఆయన మళ్లీ లేవలేదట. నావల్నీ మరణవార్త విన్న తర్వాత .. ఆ జైలుకు ఆయన తల్లి, లాయర్ వెళ్లారు. కానీ ఇప్పటి వరకు నావల్నీ మృతదేహాన్ని చూపించేందుకు జైలు మార్చురీ అధికారులు నిరాకరించారు.
నావల్నీ మృతి పట్ల ఇంకా దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎటువంటి ఫలితాలు రాలేదని రష్యా అధికారులు చెప్పారు.