సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యాటకుల కోసం అద్దెకు ఇచ్చే ఓ అతిథి గృహానికి.. నీళ్లు, గ్యాస్, కరెంట్ వాడకానికి సంబంధించి ఒక నెలకే ఏకంగా రూ.1.30 లక్షల బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి కంగుతినడం యజమాని వంతయ్యింది. ఒక నెలలో అంత బిల్లు ఎలా వచ్చింది అనుకుంటున్నారా..? వాడకం ఆ రేంజ్లో ఉంది మరి. ఆ విల్లాలో అద్దెకు దిగిన దంపతులు 25 రోజులు గడిపి అంతపని చేశారు. గ్యాస్, నీళ్లు, కరెంటు వాళ్ల అవసరానికి మాత్రమేగాక, అవసరం లేకున్నా వృథా చేశారు. పనిగట్టుకుని వృథా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేగా మీ అనుమానం..? అయితే వివరాల్లోకి వెళ్దాం..
చైనాకు చెందిన దంపతులు దక్షిణ కొరియాలోని సియోల్లో 25 రోజుల టూర్ ప్లాన్ చేశారు. అందుకే ఎయిర్ బిఎన్బీ అనే విల్లాను ఆన్లైన్లో బుక్ చేశారు. అయితే ఆ విల్లా నగరం మధ్యలో కాకుండా శివార్లలో ఉందని తెలుసుకుని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు విల్లా యాజమానిని ఫోన్లో సంప్రతించి బుకింగ్ క్యాన్సిల్ చేయాలని కోరారు. కానీ, విల్లా యజమాని డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో షెడ్యూల్ ప్రకారం దక్షిణ కొరియా టూర్కు వచ్చిన చైనా దంపతులు విల్లా యజమానిపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు.
అనుకున్న మేరకు వచ్చిన తొలి రోజు నుంచే ఆ విల్లాలోని నల్లాలు అన్నింటిని ఓపెన్ చేసి పెట్టారు. అన్ని గదుల్లో లైట్లను వేసి ఉంచారు. గ్యాస్ను కూడా ఆన్లో ఉంచారు. వాళ్లు నగరాన్ని వీక్షించేందుకు బయటికి వెళ్లినా లైట్లుగానీ, నల్లాలుగానీ, గ్యాస్నుకానీ బంద్ చేయలేదు. వారి పర్యటన కొనసాగిన 25 రోజులు అలాగే వదిలేశారు. ఆ తర్వాత టూర్ ముగించుకుని చైనాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ నుంచి విల్లా యజమానికి ఫోన్ వచ్చింది. ‘మీ ఇంట్లో గ్యాస్ లీకవుతుందేమో చూడండి.. వినియోగం భారీగా నమోదైంది’ అన్నది ఆ ఫోన్ సారాంశం.
దాంతో కంగుతిన్న యజమాని విల్లాకు పరుగుతీశాడు. వెళ్లేసరికి ఆ విల్లాలోని నల్లాలన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. గ్యాస్ మండుతూనే ఉంది. లైట్లన్నీ వెలుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే కరెంటు, నీళ్లు, గ్యాస్ వినియోగానికి సంబంధించి నెలవారీ బిల్లులు వచ్చాయి. ఆ బిల్లులు మొత్తం కూడితే రూ.1.30 లక్షలు కావడంతో విల్లా ఓనర్ షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని.. ఇంత చేసినా చైనా దంపతులను వదిలేదని ప్రతిజ్ఞ చేశాడు. వాళ్లను కోర్టుకు ఈడ్చయినా నష్టపరిహారం కట్టించుకుంటానని చెబుతున్నాడు. ఈ రివెంజ్ ప్లాన్ మామూలుగా లేదు కదా..!