పారిస్: విమానం గాల్లో ఉండగా ఇద్దరు పైలట్లు కాక్పిట్లో కొట్టుకున్నారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. గమనించిన కేబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎయిర్ ఫ్రాన్స్కు చెందిన విమానంలో ఈ సంఘటన జరిగింది. జూన్లో ఎయిర్ ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ విమానం జెనీవా నుంచి పారిస్కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయ్యి గాల్లో ఎగురుతుండగా కాక్పిట్లో ఉన్న పైలట్, కో పైలట్ మధ్య వివాదం జరిగింది. దీంతో వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఒకరి చొక్కా కాలర్ను మరొకరు పట్టుకుని చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించుకున్నారు.
కాగా, కాక్పిట్లో శబ్దాలు రావడాన్ని గమనించిన కేబిన్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. కొట్టుకుంటున్న ఇద్దరు పైలట్లకు సర్దిచెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానం గమ్యస్థానం చేరే వరకు ఒక పైలట్ డెక్లో ఉన్నాడు. ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ ప్రతినిధి ఈ సంఘటనను ధృవీకరించారు. పరిస్థితి త్వరగా సద్దుమణిగిందని, విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరిందని మీడియాకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, బ్యూరో డి ఎన్క్యూటెస్ ఎట్ డి ఎనాలిసెస్ (బీఈఏ) కూడా ఎయిర్ ఫ్రాన్స్ పైలట్ల తీరును తప్పుపట్టింది. భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ఫ్రాన్స్లో ఇటీవల జరిగిన మరిన్ని సంఘటనలతో కూడిన నివేదికను గత వారం విడుదల చేసింది.