China | బీజింగ్, అక్టోబర్ 21: మరణించిన ఆత్మీయులతో మాట్లాడటం అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరణించిన వారి రూపంతో డిజిటల్ అవతార్లను ఈ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. వీటికి ‘డెడ్బోట్’ అని పేరు పెట్టాయి. వారు జీవించి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, వీడియోలను వినియోగించి ఈ అవతార్లను తయారుచేస్తున్నాయి. ఇవి అచ్చం మరణించిన మనిషిలానే మాట్లాడతాయి. ఇటీవల ఈ డెడ్బోట్లకు చైనాలో ఆదరణ పెరుగుతున్నది. ఇదే సమయంలో దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక మనిషి మరణించిన తర్వాత కొన్ని రోజులకు సహజంగా వారిని మర్చిపోయే ప్రక్రియకు ఈ డెడ్బోట్లు ఆటంకంగా మారతాయని, మరణించిన మనిషిని మరిచిపోకుండా చేస్తాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.