సియోల్: ఉత్తర కొరియా ఇవాళ నిర్వహించిన క్షిపణి పరీక్ష విఫలమైంది. దేశ రాజధాని ప్యోంగ్యాంగ్లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ నుంచి.. పరీక్ష జరిపిన కొన్ని క్షణాల్లో ఆ మిస్సైల్ గాలిలోనే పేలింది. ఈ విఫల ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం ఓ ప్రకటన జారీ చేసింది. గత కొన్నేళ్ల నుంచి ఉత్తర కొరియా మిస్సైళ్లను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే అతి సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించనున్నట్లు ఇటీవల దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించడం ఇది పదవసారి. ఉత్తర కొరియా ఇవాళ ఉదయం 9.30 నిమిషాలకు ఓ గుర్తు తెలియని క్షిపణిని ప్రయోగించిందని, అయితే ఆ పరీక్ష జరిపిన కొన్ని క్షణాల్లోనే అది విఫలమైనట్లు సియోల్ సైనిక అధికారులు తెలిపారు. ప్యోంగ్యాంగ్లో భారీ శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు.