టోక్యో: సింహం ఉన్న బోను డోర్ లాక్ చేయడం జూ సిబ్బంది మరిచిపోయాడు. ఈ నేపథ్యంలో అది అతడిపై దాడి చేసి చంపేసింది. (Zookeeper killed by lion) జపాన్లోని ఫుకుషిమాలో ఈ సంఘటన జరిగింది. గురువారం తోహోకు సఫారీ పార్క్కు చెందిన 53 ఏళ్ల జూకీపర్ కెనిచి కటో ఒక సింహానికి ఆహారం పెట్టాడు. అయితే సెఫ్టీ డోర్ను లాక్ చేయడం మరిచిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ సింహం అతడిపై దాడి చేసింది. మెడ కొరికి చంపేసింది.
కాగా, రక్తం మడుగుల్లో పడి ఉన్న కెనిచి కటోను మిగతా జూ సిబ్బంది గమనించారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే సింహం దాడిలో సీనియర్ జూకీపర్ మరణించడం పట్ల ఆ జూ యాజమాన్యం అతడి కుటుంబానికి సంతాపం తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. అలాగే భద్రతా పరమైన చర్యలను మెరుగుపరిచేందుకు ఆ జూను తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించింది.