వాషింగ్టన్: ఉత్తర కొరియా (North Korea) క్రైస్తవుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నదని, వారి హక్కులను హరిస్తున్నదని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియాలో బైబిల్తో కనిపించిన క్రిస్టియన్లు మరణశిక్ష ఎదుర్కొంటున్నారని, పిల్లలతో సహా వారి కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ దుయ్యబట్టింది. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2022లో ఈ దారుణాలను పేర్కొంది. ఉత్తర కొరియాలో ఇతర మతాలకు చెందిన వారితో పాటు 70,000 మంది క్రైస్తవులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. బైబిల్తో కనిపించిన తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులతోపాటు రెండేళ్ల బాలుడికి కూడా జీవిత ఖైదు విధించినట్లు ఆరోపించింది. 2009లో వారిని అరెస్ట్ చేశారని, మొత్తం కుటుంబాన్ని రాజకీయ కారాగార శిబిరంలో ఉంచారని ఆ నివేదికలో పేర్కొంది.
కాగా, ఇలాంటి శిబిరంలో నిర్బంధించే క్రైస్తవులు భయంకరమైన పరిస్థితులు, దారుణాలను ఎదుర్కొంటున్నారని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియా భద్రతా మంత్రిత్వ శాఖ వారిపై 90 శాతం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టింది. ఉత్తర కొరియాలో న్యాయ ప్రక్రియను వేగవంతం చేసే, జవాబుదారీతనానికి మద్దతు ఇచ్చే లాభాపేక్షలేని సంస్థ ‘కొరియా ఫ్యూచర్’ నివేదికను ప్రస్తావించింది. మతపరమైన ఆచారాలు పాటించే వారిని, మతపరమైన వస్తువులు కలిగి ఉన్న వ్యక్తులను ఉత్తర కొరియా ప్రభుత్వం దారుణంగా హింసించినట్లు పేర్కొంది.
మరోవైపు అరెస్ట్ చేసిన క్రైస్తవులు, ఇతర మతస్తులను చిత్రహింసలకు గురి చేయడం, వారితో బలవంతంగా పనులు చేయించడం, జీవించే హక్కును నిరాకరించడంతోపాటు మహిళలను లైంగిక హింసకు గురిచేస్తున్నారని కొరియా ఫ్యూచర్ ఆరోపించింది. 2021 డిసెంబర్లో విడుదల చేసిన రిపోర్ట్లో ఈ అంశాలను పేర్కొంది. ఇలాంటి దారుణాలు అనుభవించిన 151 మంది క్రైస్తవ మహిళలతో ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.