సింగపూర్ సిటీ: భారత సంతతి వ్యక్తి ( Indian Origin Man) సింగపూర్లో మరణించాడు. షాపింగ్ మాల్ బయట ఉన్న మెట్ల పైనుంచి ఒక వ్యక్తి అతడ్ని తోసి వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు చనిపోయాడు. గత నెలలో ఆర్చర్డ్ రోడ్లోని కాంకోర్డ్ షాపింగ్ మాల్ వద్ద ఈ సంఘటన జరిగింది. భారత సంతతికి చెందిన 34 ఏళ్ల తేవంద్రన్ షణ్ముగం షాపింగ్ మాల్ బయట మెట్లు ఎక్కుతున్నాడు. ఇంతలో మెట్ల పై ఉన్న 27 ఏళ్ల ముహమ్మద్ అజ్ఫరీ అబ్దుల్ కహా అతడి ఛాతీపై చేయివేసి నెట్టాడు. దీంతో షణ్ముగం మెట్ల పైనుంచి వెనుకకు పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. తేవంద్రన్ షణ్ముగం అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో శుక్రవారం మండై శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, నిందితుడు అబ్దుల్ కహా ఉద్దేశపూర్వకంగానే షణ్ముగాన్ని మెట్లపై నుంచి కిందకు తోసినట్లు పోలీసులు ఆరోపించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇతర కేసులో నిందితుడైన అతడు బెయిల్పై విడుదలై ఈ చర్యకు పాల్పడినట్లు సింగపూర్ పోలీసులు తెలిపారు. అయితే వారిద్దరికీ ముందే పరిచయం ఉందా లేదా అన్నది తెలియదన్నారు.
Also Read: