టోక్యో: ఒక ఎయిర్లైన్ సంస్థలో పెద్ద పొరపాటు (Airline Blunder) జరిగింది. దీంతో సుమారు పది వేల డాలర్లు ఉన్న ఆసియా టు అమెరికా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు చాలా చౌకగా 300 డాలర్లకే కొందరు ప్రయాణికులు దక్కించుకున్నారు. అయితే కరెన్సీ మార్పిడిలో పొరపాటు వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు ఆ విమానయాన సంస్థ వెల్లడించింది. జపాన్కు చెందిన ‘ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ (ఏఎన్ఏ)’ లో ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి టోక్యో, న్యూయార్క్ మీదుగా కరీబియన్కు వెళ్లేందుకు, తిరిగి ప్రయాణించేందుకు బిజినెస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్లను కేవలం 890 డాలర్లకే కొందరు దక్కించుకున్నారు. అయితే 14,500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి సాధారణంగా ఏఎన్ఏ ఫస్ట్ క్లాస్లో సుమారు పది వేల డాలర్లకుపైగా టిక్కెట్ ధర ఉంటుంది.
కాగా, ఈ విషయం ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ (ఏఎన్ఏ) దృష్టికి వచ్చింది. వియత్నాం వెబ్సైట్లో జరిగిన కరెన్సీ మార్పిడి పొరపాటు వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. అయితే 20 రెట్ల కన్నా తక్కువ రేటుకే పొందిన విమాన టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు. అలాగే ఎంత మంది చౌకగా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు పొందారు, ఈ పొరపాటు వల్ల ఎంత నష్టం వాటిల్లింది అన్నది కూడా వెల్లడించలేదు.
మరోవైపు ఎయిర్లైన్ సంస్థల్లో ఇలాంటి పొరపాటు జరుగడం ఇదే తొలిసారి కాదు. 2019లో వియత్నాం నుంచి అమెరికాకు బిజినెస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్లను 675 డాలర్లకే కాథే పసిఫిక్ ఎయిర్వేస్ పొరపాటున విక్రయించింది. సాధారణంగా టిక్కెట్ ధర 16,000 డాలర్లు ఉంటుంది. అయితే పొరపాటు వల్ల తక్కువకే ఆ టిక్కెట్లను పొందిన వారిని విమానాల్లో ప్రయాణించేందుకు ఆ సంస్థ అనుమతించింది.