థింపూ: కరోనా నేపథ్యంలో సుమారు రెండున్నర ఏళ్లుగా మూసివేసిన భూటాన్ సరిహద్దులను శుక్రవారం తెరిచారు. దీంతో భారత్ నుంచి భూటాన్, ఆ దేశం నుంచి భారత్కు కొంత మంది వచ్చారు. పశ్చిమ బెంగాల్లోని జైగావ్, భూటాన్లోని ఫుంట్షోలింగ్ సరిహద్దు గేట్ నుంచి ఇరు దేశాల్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్వేగానికి గురయ్యారు. కరోనా నేపథ్యంలో భూటాన్ సరిహద్దులు మూసివేయడంతో ఇరు దేశాల్లో ఉన్న తమ వారి వద్దకు వెళ్లలేకపోయినట్లు కొందరు ఆవేదన చెందారు. సరిహద్దు గేట్ తెరిచే ముందు ఇరు దేశాలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు.
కాగా, పచ్చదనంతోపాటు, స్వచ్ఛమైన గాలితో నిండిన భూటాన్ను సందర్శించేందుకు ప్రత్యేక రుసుం చెల్లించాల్సి ఉంటుంది. స్థిరమైన అభివృద్ధి కోసం సందర్శకుల నుంచి ఫీజు వసూలు చేయాలని 2020 జనవరిలో ఆ దేశ పార్లమెంట్ నిర్ణయించింది. అయితే ఈ కొత్త విధానాన్ని కరోనా వల్ల నిలిపివేశారు. ప్రస్తుతం సరిహద్దులు తెరువడంతో దీనిని అమలు చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్, మాల్దీవుల సందర్శకులు రోజుకు రూ.1,200 చెల్లించాలి. ఇతర విదేశీయుల నుంచి రోజుకు 200 అమెరికా డాలర్లు వసూలు చేస్తారు.
మరోవైపు భూటాన్ను సందర్శించే భారతీయులకు మరికొన్ని నిబంధనలు కూడా వర్తిస్తాయి. ముందస్తు రిజిస్ట్రేషన్ను ఇప్పుడు తప్పనిసరి చేశారు. పత్రాల తనిఖీ కోసం పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డును మాత్రమే పరిగణిస్తారు. గతంలో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ను కూడా అనుమతించేవారు. అయితే ప్రస్తుతం నిబంధనలు సవరించారు. 18 ఏళ్ల లోపు వయసు వారు ధ్రువీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. సందర్శకులతోపాటు వ్యాపారులు, ఆ దేశంలో పని చేసేందుకు కూలీలు కూడా భారత్ నుంచి భూటాన్కు వెళ్తారు.