కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని ఒక్కో నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోని సగభానికిపైగా తాలిబన్ల ఆధీనంలో ఉండగా, తాజాగా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ కూడా వారి వశమైంది. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఇక ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్, మరో ప్రావిన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి.
ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్లోని తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించిన తాలిబన్లు గురువారం కొత్తగా ఘాజ్నీ, హేరట్ ప్రావిన్సులను తమ ఖాతాలో వేసుకున్నారు. తాజా ఆక్రమణతో దేశంలో మూడింట రెండొంతుల భాగం తాలిబన్ల చెరలోకి వెళ్లినట్లయింది. భద్రత బలగాలు ఎక్కడా వారికి ఎదురు నిలవలేకపోతున్నాయి. పరిమితంగా ఉన్న అమెరికా సైన్యం అక్కడక్కడా వైమానిక దాడులు జరుపుతున్నప్పటికీ, అవేమీ తాలిబన్లను నిలువరించలేకపోతున్నాయి. కాగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ను దక్షిణ ప్రావిన్సులను కలిపే కీలక రహదారి ఘాజ్నీ గుండాపోతున్నది. తాజాగా ఈ ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో దక్షిణ ప్రావిన్సులతో రాజధానికి సంబంధాలు తెగిపోయినట్టు అయింది.
ఈనేపథ్యంలో ఆఫ్ఘన్ సర్కారు తాలిబన్లతో సంధి చేసుకోవడానికి ముందుకొచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సంధి ఒప్పందంపై తాలిబన్లు విముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న తాలిబన్లను నిలువరించడంలో అక్కడి ప్రభుత్వం క్రమంగా ఓటమి అంచుల్లోకి వెళ్తున్నది. దీంతో అధికారం కోసం తాలిబన్లు సృష్టిస్తున్న హింసాత్మక ఘటనలకు ముగింపు పలుకాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో కతార్లోని దోహాలో జరుగుతున్న సదస్సులో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ‘దేశంలో తాలిబన్లు ఘర్షణ వాతావరణానికి ముగింపు పలుకాలి. దీనికి ప్రతిగా దేశ బాధ్యతలను కొంతకాలంపాటు అప్పగిస్తాం. ఇది పవర్ షేరింగ్ డీల్ అనుకోవచ్చు’ అని ఆఫ్ఘన్ ప్రభుత్వానికి చెందిన అధికారి ఒకరు ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మరికొద్ది రోజుల్లో సమస్త ఆఫ్ఘన్ భూభాగం తమ వశంకానున్న నేపథ్యంలో ‘పవర్ షేరింగ్ డీల్’కి సమ్మతించాల్సిన అవసరం తమకులేదని తాలిబన్ల అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.