కాబూల్: ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ప్రముఖ మహిళా పాప్స్టార్ ఆర్యానా సయీద్ తాను తాలిబన్లకు చిక్కకుండా తప్పించుకున్నట్లు స్పష్టంచేసింది. తాలిబన్లు కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకోగానే తాను వాళ్లకు చిక్కకుండా ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయి వచ్చానని ఆమె ప్రకటించింది. ‘నేను బతికే ఉన్నా. క్షేమంగానే ఉన్నా. రెండు మరుపురాని రాత్రుల తర్వాత ఖతర్లోని దోహాకు చేరుకున్నా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని తన ఇంటికి వెళ్లడానికి దోహాలో విమానం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆర్యానా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన 13 లక్షల మంది ఫాలోవర్స్కు తెలియజేసింది.
తాలిబన్ల కఠిన పాలనలో ఆప్ఘనిస్థాన్లోని మహిళలు, బాలికల పరిస్థితి దుర్భరంగా మారినవేళ తాను అమెరికాకు చెందిన కార్గో జెట్లో ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వచ్చానని ప్రకటన చేసింది. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట ఒక కథనాన్ని ప్రచురించింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయేందుకు విమానాలు దొరకని పరిస్థితుల్లో ఆ దేశం నుంచి తప్పించుకున్న ఆర్యానా అతికొద్ది మంది అదృష్టవంతుల్లో ఒకరని చెప్పవచ్చు.
పాప్సింగర్ ఆర్యానా సయీద్ 2015లో ఓ స్టేడియంలో పాట పాడింది. దాంతో తాలిబన్లు విధించిన మూడు నిషేదాజ్ఞలను ఆమె ఉల్లంఘించినట్లయ్యింది. అందులో మొదటి ఉల్లంఘన.. ఒక మహిళ అయి ఉండి పాట పాడటం. రెండో ఉల్లంఘన.. బుర్ఖా ధరించకపోవడం. ఇక మూడోది.. ఒక మహిళ స్టేడియంలోకి ప్రవేశించడం. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో తాలిబన్లు ఆర్యానాపై కక్షతో ఉన్నారు. అందుకే ఆమె కాబూల్ తాలిబన్ల వశం కాగానే దేశం విడిచి, ఇస్తాంబుల్లోని తన మరో నివాసానికి వెళ్లింది.