మాస్కో : కాబూల్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్ష భవనం నుంచి ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు నాలుగు కార్లు, విమానం నిండా డబ్బుతో దేశం విడిచివెళ్లాడని కాబూల్లో రష్యా రాయబారి సోమవారం వెల్లడించారు. కార్లు, విమానం నిండా నగదును నింపుకుని వాటిలో స్ధలం లేక ఇక మరికొంత నగదును పడవేసి వెళ్లాడని చెప్పారు.
తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించడంతో ఆదివారం ఘనీ దేశం విడిచివెళ్లాడని ఆర్ఐఏ వార్తాసంస్థ వెల్లడించింది. రక్తపాతాన్ని నివారించేందుకే తాను కాబూల్ను విడిచివెళ్లానని ఆ తర్వాత ఘనీ ప్రకటించారు. కాగా ఘనీ భారీ నగదుతో దేశాన్ని వీడారని రష్యా రాయబారి చేసిన వ్యాఖ్యలను రష్యన్ రాయబారి ప్రతినిధి ఇషెంకో నిర్ధారించారు.
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని రాయ్టర్స్ వార్తాసంస్థకు తెలిపారు. మరోవైపు కాబూల్లో తమ దౌత్య కార్యాలయాలు కొనసాగుతాయని రష్యా పేర్కొంది. తాలిబన్లను ఆప్ఘాన్ పాలకులుగా గుర్తించే విషయంలో తొందరపడబోమని తెలిపిన రష్యా వారి వైఖరిని నిశితంగా గమనిస్తామని అంటూనే తాలిబన్లతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు పనిచేస్తామని పేర్కొనడం గమనార్హం.