న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తిరిగి తాలిబన్ల రాజ్యం వచ్చిన తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి తెలుసు కదా. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు ఇండియాకు వచ్చారు. ఆదివారం ఉదయం కాబూల్లోని భారతీయులను తీసుకొచ్చిన సీ17 విమానంలోనే ఈ ఎంపీలతోపాటు 24 మంది సిక్కులు ఇండియాలో ల్యాండయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన సెనేటర్ నరేందర్ సింగ్ ఖాస్లా.. కంటతడి పెట్టారు. ఆఫ్ఘన్లో పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా.. ఎంపీ భావోద్వేగానికి గురయ్యారు. ఏడుపొస్తోంది. గత 20 ఏళ్లలో నిర్మించింది మొత్తం ఇప్పుడు నాశనమైపోయింది. అంతా శూన్యం అని నరేందర్ సింగ్ అన్నారు.
ఆదివారం ఉదయం సీ17 విమానంలో మొత్తం 168 ప్రయాణికులను కాబూల్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది. అందులో 107 మంది భారతీయులు ఉన్నారు. ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి ప్రతి రోజూ రెండు విమానాలను నడిపేందుకు ఇండియాకు అనుమతి లభించింది. ఆదివారం ఇండియాలో ల్యాండైన వాళ్లలో చాలా రోజుల నుంచి కాబూల్లోని గురుద్వారాలో తలదాచుకుంటున్న వాళ్లు ఉన్నారు. వీళ్లను ఇప్పుడు ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాకు తరలించనున్నారు.