ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అక్కడి ప్రజలు చేతుల్లో డబ్బులులేక తినేందుకు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతుండడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వస్తువులు దిగుమతి కాకపోతుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానిక విక్రేతలు అంటున్నారు.
మంచి పాలన అందిస్తామని చెబుతూ వస్తున్న తాలిబన్ ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఆఫ్ఘన్ కరెన్సీ అమెరికన్ డాలర్ మారక విలువతో పోలీస్తే పతనమైపోతోంది. ఈ కారణంగా అక్కడ నిత్యవసరాల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అక్కడి దుకాణ దారులు డాలర్ల కరెన్సీలో కొని.. ఆఫ్ఘనీ కరెన్సీలో అమ్మాల్సిన పరిస్థితి. దీంతో వారు కరెన్సీ విలువలో లోటుపాట్లతో రోజూ సతమతమవుతున్నారని చెబుతున్నారు.
బియ్యం ఒక చిన్న బస్తా ధర 2 వేల 700 అప్ఘనీలు, పిండి బస్తా ధర 2,400 అప్ఘనీలు, 16 లీటర్ల నూనె 2 వేల 800 అప్ఘనీలుగా ఉన్నాయి. అంతంత ధరలు భరించలేక.. అప్ఘన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఈ క్రమంలో… ఆఫ్ఘన్ ప్రజలు ఏమీ కొనలేక ఒకరోజు తిని.. మరొక రోజు పస్తులుంటున్నారు. ఆకలి బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో 8 మంది పిల్లలు చనిపోయారని స్థానిక మీడియా తెలిపింది.