కాబూల్, ఆగస్టు 18: తాలిబన్ల గుప్పిట్లోకి అఫ్గానిస్థాన్ వెళ్లిపోగానే దేశాధ్యక్షుడు సహా ఎంతోమంది ప్రాణభయంతో విమానాల్లో పారిపోయారు. అయితే, తమ హక్కులను కాలరాసే అధికారం మీకులేదని అఫ్గాన్ మహిళాలోకం ఎంతో ధైర్యంగా గొంతెత్తింది. దేశ రాజధాని కాబూల్ వీధుల్లో తాలిబన్ల నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ తమ ధిక్కార స్వరాన్ని వినిపించింది. తుపాకులతో ముష్కరమూకలు చుట్టూ చేరినప్పటికీ, ఏ మాత్రం భయపడకుండా హక్కుల కోసం అఫ్గాన్ మహిళలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సామాజిక భద్రత, పనిచేసే హక్కు, విద్యాహక్కు, రాజకీయాల్లో ప్రవేశం కల్పించాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
నిరసనలపై ఉక్కుపాదం
దేశ పార్లమెంట్ భవనంపై తాలిబన్ జెండాను ఎగురవేయడాన్ని నిరసిస్తూ జలాలాబాద్లో కొందరు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాలిబన్ జెండాలను తొలగించి అఫ్గాన్ ప్రభుత్వ జెండాలను ఎగురవేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలను అణగదొక్కేందుకు తాలిబన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించినట్టు సమాచారం. గురువారం అఫ్గానిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ నిరసన ప్రదర్శనలు జరిగినట్టు తెలుస్తున్నది. మరోవైపు అఫ్గాన్ తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.
కౌన్సిల్కే తాత్కాలిక పగ్గాలు!
అఫ్గాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకూ తాలిబన్లు ఇటీవల ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీనే అధికారిక నిర్ణయాలు తీసుకుంటుందని సమాచారం. ఈ కౌన్సిల్కు ఇస్లామిస్ట్ మిలిటెంట్ మూమెంట్ అధిపతి, తాలిబన్ కమాండర్ హైబతుల్లా అకుంద్జాదా నేతృత్వం వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాలిబన్లకు అమెరికా షాక్
తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న అఫ్గాన్ నిధులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు సమాచారం. దాదాపు 9.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్ నుంచి అన్ని ఎగుమతులు, దిగుమతులను తాలిబన్లు నిలిపేశారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు కర్జాయ్, తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి.
ఎస్పీ ఎంపీ షఫీఖర్ రెహమాన్పై దేశద్రోహం కేసు
సమాజ్వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రెహమాన్ బార్క్పై బుధవారం దేశద్రోహం కేసు నమోదైంది. అఫ్గానిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర సంగ్రామంతో రెహమాన్ పోల్చారని, ఇది దేశద్రోహం కిందికి వస్తుందని బీజేపీ నాయకుడు రాజేశ్సింఘాల్ తెలిపారు. రాజేశ్ ఫిర్యాదు మేరకు రెహమాన్పై ఐపీసీ సెక్షన్ 124ఏ (దేశద్రోహం) కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.