కాబూల్: తాలిబన్లు చంపేలోపు ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆ దేశంలోని ఘోర్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ వివాహిత వ్యక్తితో కలిసి శుక్రవారం ఇంటి నుంచి పారిపోయింది. ఆ జంటను తాలిబన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షను ఆ మహిళకు విధించారు. దీంతో తాలిబన్లు అవమానకరంగా హింసించి చంపే ముందే ఆమె స్కాఫ్ను గొంతుకు బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఆమెతో కలిసి పారిపోయిన వ్యక్తిని ఈ నెల 13న బహిరంగంగా ఉరి తీసి చంపారు. ఘోర్ ప్రావిన్షియల్ తాలిబన్ పోలీస్ చీఫ్ తాత్కాలిక ప్రతినిధి అబ్దుల్ రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఖామా ప్రెస్ పేర్కొంది.
కాగా, గత ఏడాది ఆగస్ట్లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ జరుగుతుండగానే తాలిబన్లు అనూహ్యంగా రాజధాని కాబూల్లోకి చొచ్చుకొచ్చి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ దేశాన్ని మరోసారి పాలిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తూ మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. ప్రాథమిక హక్కులైన విద్య, ఉద్యోగాన్ని హరించారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మహిళలు మరోసారి దుర్భర జీవితం గడుపుతున్నారు.