కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లపై దేశమంతా తిరగబడాలని, జాతీయోద్యమం చేపట్టాలని పంజ్షీర్ నేత అహ్మద్ మస్సౌద్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ ఆడియో సందేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. పంజ్షీర్ లోయలోని సేనలు.. తాలిబన్లను ధీటుగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తమ దళాలపై మిలిటెంట్లు దాడి చేశారని, మతపెద్దల సూచనలను తాలిబన్లు పట్టించుకోలేదని, తన స్వంత కుటుంబీకులు కూడా మరణించినట్లు మస్సౌద్ తెలిపారు. 19 నిమిషాల పాటు ఉన్న ఆడియోలో.. తాలిబన్లకు గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రపంచ దేశాలను ఆయన తప్పుపట్టారు. తాలిబన్లకు సైన్యాన్ని, రాజకీయ విశ్వాసాన్ని కల్పించిన దేశాలను మస్సౌద్ నిలదీశారు. పంజ్షీర్లో తమ దళాలు ఇంకా బలంగా ఉన్నాయని, తాలిబన్లతో పోరాడుతున్నట్లు ఆయన చెప్పారు. అయితే మరోవైపు పంజ్షీర్లో జెండా ఎగురవేసినట్లు తాలిబన్లు ప్రకటించేశారు.