న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7 : జర్మనీకి చెందిన రైట్ వింగ్ పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) సాక్కోనీ-అన్హాల్ట్ రాష్ట్ర ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏఎఫ్డీ సుమారు 44 శాతం ఓట్లను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితం జర్మన్ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఆయన కన్జర్వేటివ్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక జర్మన్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి ఏఎఫ్డీ ఇంత దగ్గరగా రావడం ఇదే మొదటిసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రీవ్ ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.
మరోవైపు ఫ్రాన్స్ దీనిని మొత్తం ఐరోపాకు ఒక కీలకమైన ఘటనగా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో అంచనా వేసిన ఎన్నికల ఫలితాల చిత్రాన్ని పంచుకున్నారు. అయితే ఆయన ఏఎఫ్డీకి మద్దతుగా ఏమీ రాయలేదు. కాగా, నాజీ పాలన నాటి చరిత్ర కారణంగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు మితవాద పార్టీలుగా పరిగణించే వాటికి చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నాయి. ఏఎఫ్డీ కూడా పలుమార్లు మితవాద తీవ్రవాదం ఆరోపణలను ఎదుర్కొంది.