China Covid | కరోనాకు పుట్టినిళ్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 11 నాటికి చైనా వ్యాప్తంగా 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు పెకింగ్ యూనివర్సిటీ (Peking University) అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. 141 కోట్ల డ్రాగన్ దేశ జనాభాలో ఇది సుమారు 64 శాతం. అత్యధికంగా గాన్సు ప్రావిన్స్ (Gansu province ) లో 91 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్రావిన్స్ తర్వాత యూనాన్ (Yunnan) ప్రాంతంలో 84 శాతం, కింఘై (Qinghai)లో 80 శాతం మంది ప్రజలు వైరస్ బారిన పడినట్లు పేర్కొంది. కాగా, చైనా వ్యాప్తంగా మరో 2-3 నెలల వరకు కొవిడ్ గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం డ్రాగన్ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీన చైనీయులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత మూడేళ్లుగా కొవిడ్ నిబంధనల మధ్య మగ్గిన చైనీయులు.. వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో కోట్లాది మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో తీవ్రదశ ఇంకా ముగియలేదని అక్కడ అధికారి ఒకరు తెలిపారు. వైరస్ విషయంలో ఇప్పటి వరకు ప్రాధాన్యత అంతా నగరాలపైనే ఉందని చెప్పారు. అయితే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.